చచ్చే చావొచ్చింది!
ధనుంజయ రావు చని పోయి ఆరు గంటలు అయ్యింది. అందరు చనిపోయిన వాళ్ళ మల్లే మొదట్లో తను కూడా చాల హడావుడి చేశాడు. ఇంకా బతికున్నాను అనే అభిప్రాయంతో బతికున్నప్పుడు తెలిసిన వాళ్ళందరి ఎదుట పడి నానా గోలా, యాగీ చేశాడు. “నేనూ! నన్ను గుర్తు పట్టకుండా వెళ్ళిపోతున్నారేంటి? అదీ నాలోంచే నడుస్తూ!” అంటూ తెగ ఫీలై పోయాడు.
అందరి లానే కాసేపయ్యాక తను చనిపోయాడు అన్న విషయం ఒంట పట్టింది అతనికి. సారీ! అతనికి ఇప్పుడు ఒళ్ళు లేదు కద! మనసుకు హత్తుకునేలా అర్థమయ్యింది.
తను చనిపోయాడు అన్న విషయం రూఢీ కాగానే చలించిపోయాడు ధనుంజయ రావు. అదే, అదే! అతని ఆత్మ చలించి పోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మామూలుగా ఐతే అతను పార్క్కి వెళ్తాడు. ఫ్రెండ్స్తో కలిసి వాకింగ్ చేస్తాడు. కాని ఇప్పుడు ఆ అవసరం లేదు.
మరి ఎక్కడికి వెళ్ళాలి? అతనికి గుర్తొచ్చింది. దెయ్యాలు (ఛీ ఛీ! అలా అనుకుంటేనే బాధగా ఉంది), ఆత్మలు ఉండేది స్మశానంలో కద. కాబట్టి అక్కడికే వెళ్ళాలి. ఉత్తరాన ఊరవతల ఉన్న స్మశానం వైపు బయలుదేరాడు.
సడన్గా గుర్తొచ్చింది అతనికి. తను ఆత్మ కద! నడవాల్సిన అవసరం లేదేమో? ఎగరడానికి ప్రయత్నించాడు ధనుంజయ రావు. ప్చ్! లాభం లేకపోయింది. దేహం లేదు అన్న బలహీనత మిగిలింది కానీ, ఎలాంటి అదనపు శక్తులు సంక్రమించినట్టు లేదు.
చేసేది లేక, నడవడం ప్రారంభించాడు ధనుంజయ రావు. దాదాపు ఒక రెండు గంటలు పట్టింది అతనికి స్మశానం చేరుకోవడానికి. ఆ రోజు బంద్ కాబట్టి ఆటోలూ బస్సులూ లేవు. దారిలో అంతా గుంపులు గుంపులుగా జనం షాపులూ, స్కూళ్ళూ, మూయిస్తున్నారు. నిజం చెప్పొద్దూ! చనిపోయాను అని తెలిసి కూడా ఒక్క క్షణం చచ్చేంత భయం వేసింది అతనికి. ఎలాగైతేనేం, కష్టపడి స్మశానం చేరుకున్నాడు.
లోపలికి వెళ్ళగానే, మూడు ఆత్మలు ఎదురు పడ్డాయి ధనుంజయ రావుకి. “ఇప్పుడే వస్తున్నావా ఊరి నుంచి?” మొదటి ఆత్మ అడిగింది. అవునన్నాడు ధనుంజయ రావు. “‘నిన్ను తంతే నాకు నొప్పి’ సినిమా ఎట్ల నడుస్తూంది?” రెండో ఆత్మ అడిగింది. అయోమయంగా చూశాడు ధనుంజయ రావు. “ఏమో నాకు తెలీదండి. నేను సినిమాలు ఎక్కువగా చూడను. కేబుల్ టీవీలో సీరియల్స్ మాత్రమే చూస్తాను. ఐనా అదేం పేరండీ?” అడిగాడు.
“గంటే, ఆ సినిమల హీరోకి హీరోయిన్ అంటే మస్తు ఇష్టం భయి! హీరోయిన్కి కష్టం వస్తే హీరోకి బాధవుతది. గందుకనే ఆ టైటిల్. గివన్నీ నాకెట్ల తెల్సినయి అనుకుంటున్నవా? దాని ప్రొడ్యూసర్ నా దోస్తే. గది రిలీజ్ అయ్యెంతలో నేను చచ్చిన అనుకొరాదే,” ఎక్స్ప్లెయిన్ చేసింది ఆ ఆత్మ.
“అది సరే కానీ క్రికెట్ స్కోర్ చెప్పండి మాస్టారూ,” అంది మూడో ఆత్మ.
“తెలీదు. ఐనా ఇదేంటి? చచ్చాక ప్రశాంతంగా ఉంటాం అనుకున్నాను. ఇక్కడ కూడా ఇదే గోలా?” ఆశ్చర్య పోయాడు ధనుంజయ రావు.
ఘొల్లున నవ్వాయి ఆత్మలు. “మేమూ అలానే అనుకున్నాం. చచ్చాకే తెలిసింది. ఇక్కడ ఇంకా బిజీగా ఉంటాం అని.” చెప్పింది మొదటి ఆత్మ.
కొంత సేపు స్మశానంలో గడిపాక ధనుంజయ రావుకి కూడా ఆ విషయం అర్థమయ్యింది. స్మశానం మహా రష్గా ఉంది. ఇంకా చెప్పాలంటే ఏదో తిరునాళ్ళలా ఉంది. పక్కన నిలబడి ఉన్న ఒక పెద్ద ఆత్మని అదే విషయం అడిగాడు ధనుంజయ రావు.
ఆయన ఫెళ్ళున నవ్వి, “పాపులేషన్ ప్రాబ్లెమండీ బాబూ! వచ్చే ఆత్మలే కానీ పోయే ఆత్మలు లేవు కద. కాబట్టి ఈ స్మశానం ఇలా కిటకిటలాడి పోతూంది. కొందరికి ఇది నచ్చక జనాల మధ్యకు వెళ్ళి ఇంటి చూర్ల మీద మకాం పెట్టారు. ఐనా ఇక్కడ ఎప్పుడూ రష్గానే ఉంటుంది,” అన్నాడు.
అకస్మాత్తుగా ఒక మూల ఏదో కలకలం చెలరేగింది. “ఏం జరుగుతూంది అక్కడ?” ఆందోళనగా అడిగాడు ధనుంజయ రావు.
“రెండు వేరు వేరు కులాలకు చెందిన ఆత్మలు కొట్టుకుంటున్నారు.”
“ఎందుకు?”
“”వాళ్ళు మొన్న కుల కక్షల వల్ల జరిగిన దొమ్మీలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు అదే ఫైట్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు,” చెప్పింది పెద్ద ఆత్మ.
తల బరుక్కున్నాడు ధనుంజయ రావు. “అన్నట్టు రాత్రి పదకొండు కావొస్తూంది. నిద్ర పోతే బెటరేమో?” అన్నాడు.
మళ్ళీ ఫెళ్ళున నవ్వింది పెద్ద ఆత్మ, “మీకు ఇది మొదటి రాత్రి కద, అందుకే తెలీదు. రాత్రి పూట నిద్ర ఏంటండీ బాబూ? కావాలంటే పగలయ్యాక కాస్త కునుకు తీద్దురు గానీ,” అంది.
“గురువు గారూ, ఏం అనుకోనంటే ఒక మాట చెప్తాను. ఆ మొదటి రాత్రి అన్న పద ప్రయోగం బాగా లేదు. పైగా మీరు మాటకి ముందు ఫెళ్ళున నవ్వడం ఆపేయ్యండి. నాకు కాస్త భయం వేస్తూంది,” అన్నాడు ధనుంజయ రావు.
“చనిపోయాక భయమేంటండి బాబూ?” అంటూ ఫెళ్ళున నవ్వబోయి ఆఖరి క్షణంలో ఆపేసింది పెద్ద ఆత్మ.
పక్కకు చూసిన ధనుంజయ రావుకి, వాళ్ళ కాలనీలో ఉండే ఏడు కొండలు కనిపించాడు.
“అరే ఏడు కొండలు, నువ్విక్కడ..?” ఆశ్చర్య పోయాడు రావు.
“మొన్నే లారి గుద్దేసింది సార్! అప్పటికెల్లి తిరుగుతున్నా ఈడ. మస్తు పరేషాన్ అవుతున్నది సార్!”
“నీకు పరేషానా? నువ్వు మన కాలనీలో పెద్ద దాదావి కద?”
“అది బతికున్నప్పుడు సార్! అప్పుడైతే చంపుతా అని భయపెడుతూండే! ఇప్పుడు కొడుకులు ఎవ్వరూ భయపడ్త లేరు.”
“ఎన్ని కష్టాలొచ్చాయి నీకు ఏడు కొండలూ!”
“అవును సార్!”
ఈ సంభాషణ ఇంకెంతసేపు నడిచేదో తెలీదు కాని మెడలో స్టెతస్కోప్ వేసుకున్న ఒక దెయ్యం, సారీ ఆత్మ, అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది, “రక్షించండి,” అంటూ.
“అరే సతీష్ గారూ! మీ వెంట పడుతూంది ఎవరండీ?” నగరంలో ప్రసిద్ధి చెందిన వైద్యుడు సతీష్ కుమార్ని గుర్తు పట్టిన ధనుంజయ రావు అడిగాడు.
“ఇంకెవరు! నా చేతిలో చచ్చిన మాజీ పేషెంట్లు అందరూ! ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనీయకుండా వేధించుకు తింటున్నారు.”
“దుక్కలా ఉండేవారు. మీరెలా పోయారు?”
“పొరపాటున నా మాత్ర నేనే వేసుకున్నా”
“ఓహో.”
ఇంతలో ఒక చిన్న గుంపు వారి వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది, “అందరూ వెళ్ళి దాక్కోండి. భూత వైద్యుడు కాద్రా ఎవరికో చేతబడి చేయడానికి ఇక్కడికే వస్తున్నాడు,” అంటూ.
“పదండి అలా కాసేపు స్మశానం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలానికి వెళ్దాం,” అంది పెద్ద ఆత్మ.
“ఆ కాద్రా మంత్రాల వల్ల మనకు ప్రమాదమా?” అడిగాడు ధనుంజయరావు.
“ప్రమాదమని కాదు. వాడు గోచీ కట్టుకుని, ఒంటికి అంతా బూడిద, నెత్తురు పూసుకుని రాత్రి చూస్తే పగలు కలలోకొచ్చేలా ఉంటాడు. పైగా ఆ బండ గొంతు వేసుకుని అవే మంత్రాలు చదువుతాడు. వాణ్ణి భరించడం చాలా కష్టం. అందుకే వాడు వెళ్ళిపోయాక మళ్ళీ వద్దాం లెండి,” సర్ది చెప్పింది పెద్ద ఆత్మ. చేసేది లేక తను కూడా స్మశానం నుంచి బయట పడ్డాడు ధనుంజయ రావు.
ఓ గంట తరువాత అంతా తిరిగి వచ్చారు.
“అబ్బబ్బా! ఈ కాద్రా గాడు ఈ మధ్య రెగులర్గా మన స్మశానానికి వచ్చేస్తున్నాడు. వాడు వచ్చినప్పుడంతా బయటకు పరిగెత్తలేక చస్తున్నాం. అసలు ఎలానో అలా వీడిని లేపేస్తే బాగుంటుంది,” విసుక్కుంది పెద్ద ఆత్మ.
“వేరే మంత్రగాడితో వీడికి చేతబడి చేయిస్తే?” సలహా ఇచ్చాడు ధనుంజయరావు.
“సరే లెండి. ఈ మంత్రగాళ్ళంతా ఒక జట్టు. ఐనా మన ఆత్మల మాట ఎవరు వింటారు? ఎవరు పట్టించుకుంటారు?” నిట్టూర్చింది పెద్ద ఆత్మ.
ఒక్క సారిగా స్మశానంలో మళ్ళీ కల కలం రేగింది. ఒక పెద్ద గుంపు వీరి వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది.
“మళ్ళీ ఏమయ్యింది?” అడిగాడు ధనుంజయ రావు.
“నగరంలో పేరు మోసిన మేటి గూండా, కబ్జా సామ్రాట్, ఇంతకు ముందే పోయాడట. ఇప్పుడు ఈ స్మశానం ఆక్రమించడానికి వస్తున్నాడట,” చెప్పింది గుంపు గోల గోలగా.
ఈ సారి ఎవరూ చెప్పే అవసరం లేకుండా తానే అందరి కంటే ముందు పరుగు లంకించుకున్నాడు ధనుంజయ రావు.
ఏంటో, ఈ మూఢ నమ్మకాలు! (టపా నంబర్ 200)
“ఇది విన్నావా బావా! ఈ సినిమా పరిశ్రమలో మూఢ నమ్మకాలు రోజు రోజుకి పెరిగి పోతున్నాయి,” అన్నాడు పేపర్ చదువుతున్న విజ్ఞాన రావు.
“ఇంతకీ దేని గురించి నువ్వు చెప్పేది?” ప్రశ్నించాడు వికాస రావు.
“నీకు తెలుసు కద మన హీరో డి. దామోదర్కి ఈ మధ్య హిట్ లేదు. ఆఖరి హిట్ మూడేళ్ళ కింద వచ్చింది. అప్పుడు ఆ పిక్చర్ హిట్ అయిన వాతావరణం లాంటిదే తన కొత్త పిక్చర్కి కూడా ఉండేలా చూస్తున్నాడట.”
“ఇందులో కొత్తేముంది, అదే నిర్మాత, దర్శకుడు, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, క్యామెరా మ్యాన్ కాంబినేషన్తోనే కద గత మూడు సినిమాలూ తీసింది?”
“కానీ ఇంకా ఏదో మిస్సింగ్ అని ఫీల్ అవుతున్నాడట. బాగా పరిశోధించగా తేలింది ఏంటంటే ఆఖరి సారి తన పిక్చర్ హిట్ ఐనప్పుడు, ముహూర్తం క్లాప్ కొట్టినప్పుడు, ఫైటు మాస్టర్ జర్రున జారి పడ్డాడట. కాబట్టి ఈ సారి కూడా ముహూర్తం టైంలో ఆయన జారి పడేలా చూస్తాడంట.”
“ఒక వేళ ఆయన జారి పడకపోతే?”
“బహుశా పడేలా తోస్తారనుకుంటా!”
“ఏంటో, ఈ మూఢ నమ్మకాలు. సరేలే నేనలా బయటకు వెళ్ళొస్తా,” అంటూ చెప్పులు వేసుకున్నాడు వికాస రావు. ఆయన అడుగు బయట పెట్టేంతలో ఒక నల్ల పిల్లి తలుపు ముందు నుంచి పరిగెట్టింది.
“ఛీ, ఛీ! ఎంత అపశకునం,” వెళ్ళబోతున్న వాడు మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చున్నాడు ఆయన.
అది చూసిన పక్కింటి నవీన్ బయట నుంచే, “భలే వారండి! ఆ పిల్లి అపశకునం ఎలా అవుతుంది. తన దారిన ఏ ఎలుకనో పట్టడానికి పోతూ, పొరపాటున మీకు ఎదురు వచ్చింది. అంతే!” అన్నాడు.
“అమ్మో మీకు తెలీదు, పిల్లి ముందు రావడం ఎంత డేంజరో! నాకు తెలిసినంతవరకు మన అల్లూరి సీతా రామ రాజు, ఇలా పిల్లి శకునం పట్టించుకోకపోవడం వల్లే తెల్ల దొరలకు దొరికిపోయాడట,” వికాస రావుకి వత్తాసు పలుకుతూ అన్నాడు విజ్ఞాన రావు.
“ఏంటో, ఈ మూఢ నమ్మకాలు,” తనలో తాను అనుకుంటూ వీధిలోకి వెళ్ళాడు నవీన్. దారిలో అతనికి సిద్ధాంతి రామ శర్మ ఎదురయ్యాడు.
“బాగున్నావా నాయనా! నిన్నే నీ జాతకం వేయడం పూర్తి చేశాను. అష్టమంలో ఉండాల్సిన శని ఈ సంవత్సరం సప్తమంలోకి వస్తాడు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. శాంతి చేయిస్తే మంచిది,” అన్నాడు రామ శర్మ.
“అలాగే చేద్దాం సిద్ధాంతి గారూ, గ్రహాలు మన జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయని ఈ మధ్య కొందరు సైంటిస్టులు కూడా ఒప్పుకుంటున్నారట. జాతకం అంటే నాకెంతో గౌరవం,” వినయంగా అన్నాడు నవీన్.
“ఏంటో, ఈ మూఢ నమ్మకాలు,” ఇదంతా చూస్తున్న వివేక్ బయటకే అనేశాడు తన ఫ్రెండ్ ప్రకాశ్తో.
“అంతే అంటావా?” అన్నాడు ప్రకాశ్.
“లేకపోతే మరేంటి? ఆ మట్టి ముద్దలు, ఆ గ్రహాలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయా? మన మధ్యనే ఉన్న దేవుడు, మన అఘోరీ బాబా తీర్చలేని సమస్యలేమన్నా ఉన్నాయా?” భక్తిగా అన్నాడు వివేక్.
“నీకు ఆయనంటే బాగా గురి అనుకుంటా?”
“అవును. నాకు ఈ జాతకాలు అంటే నమ్మకం లేదు. నాకే కష్టం వచ్చినా నేను అఘోరీ బాబా దగ్గరికి వెళ్తాను. ఆయన ఆశీర్వాదం పొందితే నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది,” అర మోడ్పు కన్నులతో అన్నాడు వివేక్.
వివేక్ తన దారిన తాను వెళ్ళగానే, “ఏంటో, ఈ మూఢ నమ్మకాలు. ఈ బాబాలు కూడా మనలాంటి మనుషులే. వాళ్ళ వల్ల ఏమవుతుంది? ఆ దేవుడి కంటే గొప్ప వాళ్ళా, వీళ్ళంతా?” అనుకుంటూ దగ్గరలో ఉన్న గుడికి బయలుదేరాడు ప్రకాశ్.
గుడికి వెళ్ళగానే పూజారి అతనికి చెప్పాడు, “ఈ రోజు చాలా మంచి రోజు నాయనా. వెంటనే ఈ గుడి చుట్టూ 108 పొర్లు దండాలు పెట్టి రా. దానితో అన్ని దోషాలూ నివారణ అవుతాయి,” అని.
ప్రకాశ్ పొర్లు దండాలు పెడుతూంటే, బయట కారులో వెళ్తున్న సైంటిస్ట్ ప్రగతి కుమార్, ఆయన భార్య ఈ దృశ్యాన్ని చూశారు.
“ఏంటో, ఈ మూఢ నమ్మకాలు! ఇరవయ్యి ఒక్కవ శతాబ్దంలో కూడా ఇలాంటివి చూస్తే చాలా బాధగా ఉంటుంది. చూస్తూంటే ఆ అబ్బాయి చదువుకున్న వాడిలా కూడా ఉన్నాడు,” కాస్త బాధ పడింది మిసెస్ ప్రగతి కుమార్.
“చదువు వల్ల విజ్ఞానం రాదోయి. మనుషులకి ఒక ఆలంబన కావాలి. ఒక సపోర్ట్! అందుకనే ఆ సెక్యూరిటీని బాబాల్లోనో, జాతకాల్లోనో, దేవుడిలోనో వెతుక్కుంటారు, ” గంభీరంగా చెప్పాడు ప్రగతి కుమార్.
“బాగా చెప్పారండి. మాటల్లోనే మీ ఆఫీసు వచ్చేసింది. మిమ్మల్ని డ్రాప్ చేసి నేను వెళ్తాను,” ప్రగతి కుమార్ ఆఫీస్ రావడంతో చెప్పింది ఆయన శ్రీమతి.
“ఉండవోయి. కాస్త నువ్వు కూడా దిగి, నేను ఆఫీసులోకి వెళ్తూంటే ఎదురు రా. ఈ రోజే నా ప్రమోషన్ సంగతి తేలిపోతుంది. నువ్వెదురొస్తే సాధారణంగా మంచి జరుగుతుంది,” అన్నాడు ప్రగతి కుమార్.
జ్వా.ద్వీ.ర. వెనుక కథ
నేను చిన్నప్పుడు అత్యంత ఆసక్తిగా చదివిన కథలు, జానపద కథలు.
ఆ కథల్లోని జగదేక వీరులు, అతిలోక సుందరులు, మహా మాంత్రికులు, దుష్ట సేనాపతులు, విధేయులైన మంత్రులు, దేవతలు, రాక్షసులు మొదలైన పాత్రలు నన్ను కట్టి పడేసేవి. ఆ రోజుల్లో నాకు అందుబాటులో ఉన్న రంగుల ప్రపంచం అదే.
తేటగీతి బ్లాగ్లో అనేక అంశాలపై సెటైర్ వేయడం, ప్యారడీ పండించడం జరిగాక, నేను గమనించింది నేను కవర్ చేయని టాపిక్స్లో ఒకటి జానపదాలని.
“కాదేదీ ప్యారడీకి అనర్హం, అవునవును సెటైర్ అనర్ఘం” అని నమ్మిన వాడిని కాబట్టి వెంటనే ఆ లోపాన్ని సవరించే ప్రయత్నంగా జ్వాలా ద్వీప రహస్యం వ్రాయడం జరిగింది.
My stories write themselves అని కొందరు రచయితలు అంటే, నాకు నమ్మకం కలిగేది కాదు ఒకప్పుడు. అదెలా సాధ్యం అని.
కాని నేను రచయితనయ్యాక నాకు కూడా అనుభవంలో వచ్చిన విషయం అది. జ్వా.ద్వీ.ర. కథ కూడా పెద్దగా నా ప్రమేయం లేకుండా అదే సాగిపోయింది.
కొందరు పాఠకులకు నేను ఈ కథ తొందరగా ముగించాను అని నిరాశ కలిగింది అని నాకు తెలుసు. కానీ నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ కథ ముగింపు అదే రాసుకుంది. నిజం! వీరబాహుడి మీదొట్టు!
-మురళి
జ్వాలా ద్వీప రహస్యం – 25 (ఆఖరి భాగం)
“అదన్న మాట జ్వాలా ద్వీప రహస్యం! గానానంద స్వామి మంత్ర మహిమ, అక్కడ ఉన్న ఆటవికులు వాడే దురగ గుండాకు, ఆ ద్వీపాన్ని అభేద్యంగా చేసాయి,” అన్నాడు నరస సింహుడు ఆత్రవిందతో.
“అవును పుట్టలో బంధింపబడి ఉన్న గానానంద స్వామి విషయం నాకు తెలిసిపోయింది కాబట్టి, ఆ రహస్యం బయట పడకూడదని నన్ను ఆ ద్వీపంలో బంధీ చేశారు,” చెప్పింది ఆత్రవింద.
“అది సరే, మరి ఈ పండు కోతి ఆ రహస్యం బయట పెట్టలేదు కదా, దీన్ని కూడా ఎందుకు బంధించారు?” సందేహంగా అన్నాడు యువరాజు.
“దాన్ని బంధించింది మీరు దాని కోసం వస్తారని, అప్పుడు మీతో పాట పాడించవచ్చని,” సమాధానం చెప్పింది రాకుమారి.
“ఓ, నిజమే! కానీ నేను ఆయన్ని శాపవిముక్తుడిని చేయలేకపోయాను. యమ కింకరి, యమానంద లహరి పాడి ఉంటే బాగుండేది,” విచారంగా అన్నాడు నరస సింహుడు.
“పోనీ లెండి, మీరు అనుకున్నది సాధించారు కద! ఆ పాట ఇక్కడ మాత్రం పాడకండి. అసలే మేఘాల మధ్య పయనిస్తున్నాం. నేను ఎటూ వెళ్ళ లేని పరిస్థితి కూడా,” కాస్త భయంగా అంది ఆత్రవింద.
“గానానంద స్వామికి ఏ మాత్రం ఉపయోగ పడలేని నా గాత్రం అంటే నాకు విరక్తి కలిగింది. గాన వైరాగ్యం వచ్చింది. ఇక పాటలు పాడను, ఒక షట్ కళ్యాణిని పరిగెత్తించాలంటే తప్ప,” విషాదంగా అన్నాడు నరస సింహుడు.
“నన్ను జ్వాలా ద్వీపం నుంచి విడిపించినందుకు ఇప్పటికే మీకు ఋణపడి ఉన్నాను. ఈ నిర్ణయం తరువాత మీ మీద అభిమానం మరింత పెరిగింది,” సిగ్గు పడుతూ అంది ఆత్రవింద.
దానికి నరస సింహుడు బదులు చెప్పేంతలో తివాచీ బెంగ నగరం చేరుకుంది. సరిగ్గా నగరం మధ్యలో దిగి నేలకు ఒక అడుగు పైన ఆగింది. ఆ కూడలిలో ఉన్న ప్రజలు రాకుమారిని చూడగానే ఆనందోత్సాహలతో చుట్టు ముట్టారు.
“రాకుమారి తిరిగి వచ్చేసింది. పరదేశీ విజయుడై తిరిగి వచ్చాడు. నరస సింహుడికి జై. మహారాజు అశృ సింహులకు జై,” అంటూ జయ జయ ధ్వానాలు కావించారు.
అక్కడ ఉన్న ప్రజల్లోనే మత్స్య కుమారుడు కూడా ఉన్నాడు. “నా తెప్ప, నా తెడ్లు,” అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వాటిని తీసుకున్నాడు.
నరస సింహుడు, ఆత్ర వింద, పండు కోతి తివాచీ పై నుంచి కిందకి దిగారు. వెంటనే తివాచీ రివ్వున గాలిలోకి ఎగిరి జ్వాలా ద్వీపం వైపు శర వేగంతో పయనిస్తూ కొద్ది క్షణాల్లో మాయమయ్యింది.
అశృ సింహుడికి అతి వేగంగా ఈ వార్త అందిపోయింది. హుటా హుటిన ఆయన అక్కడికి వచ్చేశాడు. ఆత్రవిందని చూడగానే ఆయన కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు జల జలా రాలాయి.
ఆత్రవింద తండ్రిని చూడగానే ఆత్రంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన అక్కున చేరింది. “భళా పరదేశీ, భళా! ఎవరూ వెళ్ళడానికి కూడా సాహసించని జ్వాల ద్వీపానికి వెళ్ళి మా పుత్రికని రక్షించి ఆమెతో క్షేమంగా తిరిగి వచ్చావు. నీ ఋణం తీర్చుకోలేను. అక్కడ ఎలాంటి సాహస కృత్యాలు చేశావో వినాలని కర్ణ కుతూహలంగా ఉంది,” అన్నాడు మహారాజు నరస సింహుడిని ఉద్దేశించి.
“తండ్రీ! ఆయన ఏ సాహసమూ చేయలేదు. కేవలం ఒక పాట పాడి నన్ను, తన పండు కోతిని విడిపించుకున్నారు,” చెప్పింది ఆత్రవింద.
“నిజమా? ఆ పాటేదో వినవలెనని మాకు ఎంతో కోరికగా ఉంది,” అన్నాడు అశృ సింహుడు.
“ఆ పాట పాడేశాను కద. కావాలంటే ఇంకొకటి పాడుతాను. యమ కింకరి, యమనంద లహరి అని ఉంది లెండి,” తను సిద్ధమే అని తెలియజేశాడు నరస సింహుడు.
“నహీ!” ఈ సారి ఆత్రవింద అరిచింది సంస్కృతంలో. “ఆ పాట అలా అల్లరి చిల్లరిగా పాడకూడదు. ఐనా, మీరు ఇంతకు ముందే కద, గాన వైరాగ్యం వచ్చింది అన్నారు,” చిరు కోపంగా అంది నరస సింహుడిని చూసి.
“నిజమే కదూ! మరిచి పోయాను. ఇక మళ్ళీ పాట పాడకూడదు అని నిర్ణయం తీసుకున్నాను, మహారాజా! క్షమించండి,” అన్నాడు నరస సింహుడు అశృ సింహుడితో.
“అది మా దురదృష్టము పరదేశీ,” బాధగా అన్నాడు మహారాజు. అంతలోనే ఆయన మొహం విప్పారింది.
“ఇచ్చిన మాట ప్రకారం, నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేస్తాను. ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీట వేసి…” అంటున్న అశృ సింహుడి వాక్ప్రవాహానికి అడ్డు కట్ట వేస్తూ, “అంత సమయం లేదు మాహారాజా! నేను త్వరగా దోమదేశం చేరుకోవాలి. మాములు పీటా పందిరి తోనే పెళ్ళి జరిపించండి,” అన్నాడు నరస సింహుడు.
“నీ ఇష్ట ప్రకారమే కానీ, పరదేశీ! నేనూ, మా ప్రజలూ నీకు సదా కృతజ్ఞులం,” అంగీకారం తెలియజేశాడు మహారాజు.
ఉన్న తక్కువ వ్యవధిలోనే పెళ్ళి ఎంతో ఘనంగా చేశాడు అశృ సింహుడు. బెంగ నగరం అంతా పెళ్ళికి తరలి వచ్చింది. పెళ్ళి అయ్యాక నృత్య గానాలు జోరుగా సాగాయి. మత్స్య కుమారుడు తెడ్లు రెండు చేతులతో పట్టుకుని గెంతుతూ పాడిన, “పెద్ద పెద్ద వాగులో, ఎన్ని వేల చేపలో! ఎన్నో ఉన్నవి కానీ, ఎల్లప్పుడు కాదులే!” పాట అందరికీ బాగా నచ్చింది.
ఆత్రవింద అత్త వారింటికి బయలు దేరాల్సిన సమయం వచ్చింది. రెండు రథాల నిండా సారె నింపి అరణంగా ఇచ్చాడు అశృ సింహుడు. అంతే కాకుండా పది దాసీలతో సహా ఇంకో రెండు రథాలు ఇచ్చాడు.
“ఇంత మంది దాసీలు ఎందుకు మామ గారూ! మా దగ్గర ఇప్పటికే బోలెడు మంది ఉన్నారు,” అభ్యంతరం తెలిపాడు నరస సింహుడు.
“ఫరవా లేదు అల్లుడు గారూ. మీదసలే పెద్ద రాజ్యం. ఇంకో పది మంది దాసీలు మీకు భారం కారు. కానీ మూడు పల్లెలే ఉన్న మా రాజ్యానికి కొంత ఖర్చు కలిసి వస్తుంది,” చెప్పాడు మహారాజు.
“ఓహో! ఇందుకన్న మాట అరణాలు పెట్టేది,” ఆశ్చర్య పోయాడు యువరాజు.
“ఇవే కాకుండా మీ ఇద్దరి కోసం ఇంకో రథం ప్రత్యేకంగా సిద్ధం చేశాం. మీరు అందులో బయలు దేరండి,” అన్నాడు అశృ సింహుడు.
“లేదు మామగారూ. నేనూ ఆత్రా, మా షట్కళ్యాణి మీదే ప్రయాణిస్తాం. అసలే దాని మనసు చాలా సున్నితమైనది. తిరుగు ప్రయాణంలో దాన్ని పట్టించుకోలేదని తన మనోభావాలు దెబ్బ తినే ప్రమాదం ఉంది,” అన్నాడు యువరాజు.
“కానీ ఆ గుర్రం పరమ బద్ధకస్తురాలు. దాన్ని క్రితం సారి మేము పరిగెత్తించలేక, రథంలో తీసుకు వెళ్ల వలసి వచ్చింది,” సందేహం వ్యక్తం చేశాడు మహారాజు.
“దానికి ఒక చిట్కా ఉంది. షట్కళ్యాణికి ఒక పాట అంటే మిక్కిలి మక్కువ. అది పాడితే వెంటనే దౌడు తీస్తుంది. మీరు దాన్ని ఇక్కడికి రప్పించండి,” అర్థించాడు నరస సింహుడు.
షట్కళ్యాణి రాగానే ముందు తను అధిరోహించి, తరువాత ఆత్రవిందకు తన ముందు కూర్చోవడానికి సహాయం చేశాడు యువరాజు. పండు కోతి కిచ కిచలాడుతూ వచ్చి నరస సింహుడి వీపుని కరుచుకుంది. యువరాజు గొంతు సవరించుకున్నాడు.
“ఆగండి అల్లుడు గారూ! పాట పాడడం మానేశాను అన్నారు కద?” అడ్డు పడ్డాడు అశృ సింహుడు.
“మామగారూ! మీకు తెలీనిదేముంది? ‘వారిజాక్షులయందు, విత్తంబు యందు, వీర బాహుడి ముందు, షట్కళ్యాణి ముందు బొంక వచ్చును’ అన్న ఆర్యోక్తి వినలేదా?” గంభీరంగా అన్నాడు నరస సింహుడు.
“మొదటి భాగం విన్నట్టున్నాను. సరే అలాగే కానివ్వండి,” అడ్డు తొలిగాడు మహారాజు.
“అందరు ఇంట్లో వెచ్చగా, మనం బయట కచ్చగా. పదవే పదవే పోదాం,” అంటూ పాడాడు నరస సింహుడు.
షట్కళ్యాణి పరుగు మొదలు పెట్టింది. వెనుకనే సారె, దాసీలతో నిండి ఉన్న రథాలు దాన్ని అనుసరించాయి.
***
దోమ దేశం రాజ ధానిలోకి ప్రవేశించగానే దారికి ఇరు వైపులా బారులు తీరి నిలబడి ఉన్న జనం జయ జయ ధ్వానాలు పలుకుతూ వారిని ఆహ్వానించారు.
మళ్ళీ అదే సందేహం వచ్చింది నరస సింహుడికి. “వీరికి ఎటుల తెలియునో కానీ, మేము బయటకు వస్తే చాలు, బాటకు ఇరు వైపులా తయారగుదురు,” అనుకున్నాడు.
సూటిగా రాజ మందిరానికి చేరుకున్నాడు యువరాజు. కోతిని భుజం మీద ఎక్కించుకుని, ఆత్రవింద చేయి పట్టుకుని వడి వడిగా నీరస సింహుడి శయనాగారానికి వెళ్ళాడు.
“జయము, జయము యువరాజుల వారికి,” అంది ద్వారం దగ్గర నిలబడి ఉన్న చెలికత్తెలలో ఒకతి.
“తండ్రి గారు నిద్ర పోవుచున్నారా?” అడిగాడు ఆమెని నరస సింహుడు.
“లేదు యువరాజా! వారు తమ సభలో కొలువు తీరి ఉన్నారు,” వినయంగా సమాధానమిచ్చింది చెలికత్తె.
“అదేమిటి?” ఆశ్చర్యపోయాడు యువరాజు. “నేను కోతి కోసం బయలు దేరినప్పుడు చాలా నీరసంగా పక్క మీద శయనించి ఉన్నారు. ఇప్పుడేమో కొలువు తీరి ఉన్నారా?”
గిర్రున వెనక్కి తిరిగి, ఆత్రవింద, కోతితో సహా రాజసభ వైపు వడి వడిగా అడుగులు వేశాడు నరస సింహుడు. సభలో ప్రవేశించగానే విపరీతమైన ఆశ్చర్యం కలిగింది అతనికి. నీరస సింహుడు హుందాగా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఏదో సమావేశం జరుగుతున్నట్టు ఉంది. మంత్రి వృద్ధ భట్టు చెప్తున్నది శ్రద్ధగా వింటున్నాడు మహారాజు.
“నాన్న గారు, నేను కొండ మీద కోతిని తీసుకుని వచ్చాను,” పెద్ద గొంతుతో ప్రకటించాడు నరస సింహుడు.
నీరస సింహుడు తల ఎత్తి చూశాడు. కుమారుని చూడగానే ఆయన పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. కాని ఆయన యువరాజు భుజం మీద కోతిని చూడ లేదు.
“అదేమిటి కుమారా, అందమైన నాతిని పక్కన పెట్టుకుని కోతి అంటున్నావు? దేశాటనం వల్ల నీకు మతి భ్రమణం కలగలేదు కద?” అన్నాడు మహారాజు.
“భుజం మీద చూడండి నాన్న గారూ,” కోపంగా అన్నాడు నరస సింహుడు.
మహారాజు తన భుజం మీద చూసుకున్నాడు. “ఎప్పటిలానే భుజ కీర్తులు ఉన్నాయి, అదేనా నువ్వు నన్ను చూడమంది?” అడిగాడు.
“అహో! మీ భుజం కాదు, నా భుజం మీద!” విసుగ్గా అన్నాడు యువరాజు.
అప్పుడు గమనించాడు నీరస సింహుడు పండు కోతిని. “ఓ, ఐతే మేము పంపిన సందేశం నీకు చేరలేదన్న మాట,” మెల్లగా అన్నాడు.
“సందేశమా? ఏం సందేశం?”
“వాయు కుమారుడనే వార్తాహారుడితో నీకు సందేశం పంపాను. అతను వాయువేగంతో పరిగెట్ట గల శక్తి ఉన్న వాడు. కానీ అతడు నిన్ను చేరుకోలేకపోయినట్టు ఉన్నాడు,” నీరసంగా అన్నాడు నీరస సింహుడు.
“నేను తూర్పు వైపు కద వెళ్ళింది! అతను బహుశా పడమటి వైపు పరిగెత్తి ఉంటాడు. ఇంతకీ సందేశం ఏమిటో చెప్తారా?”
“వైద్యుల వారు తన తాళపత్ర గ్రంథం తప్పుగా చదివారట. నేను తినాల్సింది కొండ మీది కోతి గుండె కాదట. కొండె మీది గోతి కుండె అట. అది చెప్పి నిన్ను వెనక్కి రప్పించడానికే వాయుకుమారుడిని పంపించాను.”
“గోతి కుండా? అదేమిటి?”
“అది ఒక అపురూపమైన వన మూలిక. మన దోమ దేశానికి ఈశాన్యంలో ఉన్న కొండెల్లో దొరుకుతుంది. అది తినగానే నా అస్వస్థత చిటికెలో మాయమయ్యింది. నన్ను మన్నించు కుమారా! ఎంతో కష్ట పడి కొండ మీద కోతిని తెచ్చావు. కానీ అది ఇప్పుడు మనకు అవసరం లేదు.”
“అయ్యో! అదేం మాట నాన్న గారూ! మీ ఆరోగ్యం బాగు పడింది, నాకంతే చాలు. నా అభిప్రాయం ప్రకారం పండు కోతికి కూడా ఈ విషయం పట్ల ఎలాంటి అభ్యంతరమూ ఉండ కూడదు.”
“అలా ఐతే నేను దీన్ని పెంచుకుంటా,” ఉత్సాహంగా అంది ఆత్రవింద.
“తప్పు ఆత్రా! ముసలి కోతులని పెంచుతాము అనకూడదు,” అన్నాడు నరస సింహుడు.
“ఇంతకీ ఈ కన్యామణి ఎవరు?” అడిగాడు నీరస సింహుడు.
“మీ మొదటి కోడలు నాన్న గారూ. కోతిని వెతుకుతూ నేను చేసిన యాత్రలో చింతదేశపు యువరాణి ఐన ఈ ఆత్రవిందని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఆత్రా, ఈయనే మా నాన్న గారు,” అన్నాడు నరస సింహుడు ఆత్రవింద వైపు తిరిగి.
ఐతే ఆత్రవింద మొహం ఎరుపెక్కి ఉండడం చూసి ఆశ్చర్యపోయి, “అదేమిటి? ఎందుకంత కోపం?” అడిగాడు.
“లేకపోతే? నేను, మొదటి కోడలినా? దాని అర్థం మీకు ఇంకొన్ని వివాహములు చేసుకునే ఉద్దేశం ఉందనే కద?” హుంకరించింది ఆత్రవింద.
నాలుక కరుచుకున్నాడు నరస సింహుడు. “నేను వేరే వివాహములు చేసుకోకపోయినా కూడా, నువ్వు మా నాన్న గారి మొదటి కోడలివే అగుదువు కద. అదన్న మాట. ఆ! నాన్న గారూ, నాదొక చిన్న కోరిక,” అన్నాడు యువరాజు తండ్రి వైపు తిరిగి.
“చెప్పు కుమారా? ఏమా కోరిక?”
“ఈ దేశాటనం వల్ల నా ఖడ్గ శిక్షణకు అంతరాయము వాటిల్లినది. రేపే వీరబాహుడితో కత్తి యుద్ధానికి ఏర్పాటు చేయండి, చాలు,” అన్నాడు నరస సింహుడు.
“అలాగే!” మాట ఇచ్చాడు మహారాజు.
***
మళ్ళీ వ్యాయామ శాల వద్దే కత్తి సాముకి ఏర్పాట్లు జరిగాయి. ఐతే ఈ సారి పోటీని వీక్షించడానికి వేలమంది ప్రజలు తరలి వచ్చారు. దానికి కారణం, నరస సింహుడు ప్రతి ఒకరిని దండోరా వేయించి ఆహ్వానించడమే.
“ఇంత మంది ఎందుకు యువరాజా? అసలే ఆ వీర బాహుడు జనన్ని చూస్తే మదించి పోతాడు. వానికి కీర్తి కండూతి ఎక్కువ. మీకు వీలైనన్ని ఎక్కువ గాట్లు పెట్టునేమో?” సందేహం వెలిబుచ్చాడు వృద్ధ భట్టు.
“పెక్కు మంది ముందు వాని పీచమణచుట కొరకే ఈ ఏర్పాటు,” గంభీరంగా అన్నాడు నరస సింహుడు.
“కత్తి సాము ప్రారంభించండి,” ఆజ్ఞాపించాడు మహారాజు.
ఆత్రవిందను చూసి కన్ను గీటి, దోమాంబకు మనసులోనే నమస్కారం చేసుకొని గోదాలోకి దిగాడు యువరాజు.
“మీరు దేశాటనకు వెళ్ళిన రోజు నుండి ఈ కత్తిని పదును పెడుతూనే ఉన్నాను. చాలా వాడిగా ఉంది,” అన్నాడు వీర బాహుడు.
“ఉండును, ఉండును. నా దగ్గర ఉన్నది కూడా ప్రత్యేకమైన ఖడ్గమే. ఈ రోజు తాడో పేడో తేలిపోవాలి,” గర్జించాడు నరస సింహుడు.
అలా అన్న వెంటనే వేగంగా కదిలి తన కత్తిని వీర బాహుడి చేతులకు, కాళ్ళకు, భుజాలకు, చాతీకి తగిలించాడు.
“ఇదేమి విన్యాసము? ఒక్క రక్తపు బొట్టు కూడా చిందలేదు,” హేళనగా అంటూ యధా విధిగా యువరాజు ఒంటి నిండా గాట్లు పెట్టడానికి సిద్ధమయ్యాడు వీరబాహుడు.
అంతలోనే అకస్మాత్తుగా ఒంటి మీద ఏవో పురుగులు పాకుతునట్టు మెలికలు తిరిగిపోయాడు వీరబాహుడు. కింద పడిపోయి దొర్లడం మొదలు పెట్టాడు. నరస సింహుడు ఆ అవకాశం వదులుకోకుండా శర వేగంగా కదిలి వీరబాహుది ఒంటి నిండా పదునైన గాట్లు పెట్టాడు.
ఒకే ఒక నిముషంలో పోరాటం ముగిసి పోయింది. కేకలు పెడబొబ్బలు పెడుతున్న వీరబాహుడిని నలుగురు మల్ల యోధులు గోదానుంచి లేవనెత్తి బయటకు తీసుకుని వెళ్ళిపోయారు.
“భళా కుమారా, నీ ఖడ్గ విద్యా విన్యాసం సంస్తుతి పాత్రం!” మెచ్చుకున్నాడు నీరస సింహుడు. కత్తి సాము వీక్షించడానికి వచ్చిన ప్రజలంతా హర్ష ధ్వానాలు చేశారు. ఆత్రవింద, వృద్ధ భట్టు లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టారు.
నరస సింహుడు విజయ గర్వంతో తల ఎగరేశాడు. అతని పెదవుల మీద చిరు మందహాసం రూపు దిద్దుకుంది. జ్వాలా ద్వీపం వదిలి వస్తున్నప్పుడు గండ్ర మండ్రలని అతను అడిగింది కొంత దురద గుండాకు ఇమ్మని. అదే ఆకు పసరుని తన కత్తికి పట్టించి, వీరబాహుడిని కత్తి సాములో సులువుగా ఓడించగలిగాడు నరస సింహుడు.
ఆ తరువాత యువరాజు సాహస యాత్ర విజయవంతంగా ముగిసినందుకు దేవికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి, దోమాంబ ఆలయం దిశగా బయలుదేరింది నీరస సింహుడి పరివారం.
(అయిపోయింది)
జ్వాలా ద్వీప రహస్యం – 24
గొంతు సవరించుకున్నాడు నరస సింహుడు. గాననంద స్వామి కళ్ళు తడిబారాయి. ఆత్రవింద యువరాజు వైపు ఓర చూపులు చూసింది. ఆటవికులు కూడా చెవులు రిక్కించారు. పండు కోతి కిచ కిచలాడడం మానేసింది. ఆఖరికి ప్రకృతి కూడా మౌనం వహించింది.
“శ్రీ తుంబుర నారద బాధామృతం,” గొంతు చించుకున్నాడు నరస సింహుడు. పల్లవి పూర్తి కాక ముందే రెండు పక్షులు గాలిలో ఎగురుతున్నవి అలాగే టక్కున నేల రాలిపోయాయి. పండుకోతి రెండు చేతులతో చెవులు మూసుకుంది. ఆత్రవింద మేలిముసుగుని చెవుల్లో కుక్కుకుంది. గోచీలు కట్టుకున్న ఆటవికులకు ఆ అవకాశం లేక ఆకులు చెవుల్లో దూర్చుకున్నారు. ఆటవిక రాజూ, రాణీ, మెడలో వేసుకున్న పూసల దండలు తెంపి ఆ పూసలు కుక్కుకొని తమ కర్ణేంద్రియాలు రక్షించుకున్నారు.
ఏమీ చేయలేకపోయింది గానానంద స్వామి మాత్రమే! పుట్టలో చేతులు ఇరుక్కుపోవడం వల్ల వాటిని బయటకు తీయలేక, తన కర్ణభేరులు రక్షించుకోలేక, ఆయన తల్లడిల్లి పోయాడు.
తడిబారిన ఆయన కళ్ళల్లోంచి కన్నీళ్ళు బొట బొటా రాలడం మొదలు పెట్టాయి. నరస సింహుడు తన చుట్టూ జరుగుతున్న భీభత్సం పట్టించుకోకుండా పల్లవి ముగించి చరణం మొదలు పెట్టాడు.”సప్త వర్ణముల మృత్యుకగా, శప్త వర్ణముల డోలికగా,” అంటూ.
“ఒరే నాయనల్లారా! ఎవరన్నా వచ్చి నా చెవులు మూయండ్రా!” బిగ్గరగా అరిచాడు గానానంద స్వామి అక్కడున్న వాళ్ళని ఉద్దేశించి.
అక్కడున్న వాళ్ళందరికి గానానంద స్వామి ఏదో తమతో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడని అర్థమయ్యింది. కానీ ఎవరికీ తమ చెవుల్లో ఉన్న అడ్డు తీసే ధైర్యం లేకపోయింది. అప్పటికే వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నా, ఎంతో కొంత ధ్వని వాళ్ళ చెవుల్లో దూరుతూనే ఉంది. అడ్డు తీస్తే ఇంకేమైనా ఉందా!
“వాన జల్లుల వేళ ఆ వక్ర వాకాల, ఆ ఆ ఆ, వాన జల్లుల వేళ ఆ వక్రవాకాల, హర్షాతిరేకాలు దెయ్యతమే” నరస సింహుడు ఉత్సాహం పుంజుకున్నాడు.
ఆటవిక రాజూ, ఆటవిక రాణీ కూర్చుని ఉన్న వేదిక చుట్టూ భూమి బీటలు బారింది. మేలు ముసుగు శబ్దాన్ని ఆపలేకపోయినట్టు ఉంది, ఆత్రవింద కూడా కొన్ని ఆకులు కుక్కుకుని తన చెవులకు అధిక రక్షణ ఇవ్వడానికి ప్రయత్నించింది.
గానానంద స్వామి తనకు తెలిసిన మంత్రాలు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. కానీ లాభం లేక పోయింది. నరస సింహుడి పాట ఆయన్ని కుదురుగా ఆలోచింపనీయడం లేదు. కాబట్టి ఏదన్నా మంత్రం ఉపయోగించి నరస సింహుడి గొంతు స్తంభింప చేద్దామన్నా ఆయనకు వీలు పడలేదు.
“మ గ మ గ రి, గ రి గ రి స,” తారా స్థాయికి చేరుకో సాగింది నరస సింహుడి గొంతు. అదిగో అప్పుడే ఎవరూ ఊహించని సంఘటన జరిగి పోయింది. పండు కోతి చెవులు మూసుకునే చెంగు చెంగున గెంతుతూ వచ్చి నరస సింహుడి భుజాల మీదకెక్కి అతని నోరు గట్టిగా మూసేసింది. పాట ఆగిపోయింది!
యువరాజు దేహం దహించుకుపోయింది. కోతి చేతులు పక్కకి లాగేసి, “ఎందుకు నా గాన ప్రవాహానికి అడ్డు పడ్డావు?” కోపంగా అడిగాడు. కోతి కిచ కిచలాడుతూ గానానంద స్వామి వైపు వేలు పెట్టి చూపించింది.
అటు కేసి చూసి గతుక్కుమన్నాడు నరస సింహుడు. గానానంద స్వామి చెవులు ఎర్రగా కంది పోయి ఉన్నాయి.
కోతి మళ్ళీ కిచ కిచలాడి అదే వేలితో చుట్టూతా చూపించింది. అప్పుడు గమనించాడు యువరాజు, చచ్చి పడిన పక్షులని, బీటలు వారిన నేలని, ఆకులు చెవుల్లోంచి తీస్తున్న ఆత్రవిందని, ఆటవికులని.
“ఏమయ్యింది వీళ్ళందరికీ?” ఆశ్చర్యంగా అడిగాడు నరస సింహుడు. గానానంద స్వామి గొంతు సవరించుకున్నాడు. కాని మాటలు బయటకు రాలేదు.
“అయ్యో మీ పుట్ట యదాతథంగా ఉందే. ఈ కోతి నన్ను పాట పూర్తి చేయనీయలేదు. అందుకే కాబోలు మీ శాప నివారణ కాలేదు. ఏం ఫర్లేదు. ఈ సారి ఇంకో గొప్ప పాట అందుకుంటాను,” అన్నాడు నరస సింహుడు ఆయన్ని ఉద్దేశించి.
“నహీ!” సంస్కృతంలో గట్టిగా అరిచాడు గానానంద స్వామి. “ఇంకో పాట వింటే పుట్ట కరిగిపోవడం అటుంచి నేను అరిగిపోయేలా ఉన్నాను. దయ చేసి ఆ ఆలోచన మానుకో,” అంటూ పుట్టపై నుంచి ఎంత దీనంగా అర్థించగలడో అంత దీనంగా అర్థించాడు.
అయోమయంగా చూశాడు నరస సింహుడు. “అదేంటి? మరి మీ శాప నివారణ ఎలా అవుతుంది?” అడిగాడు.
“నాకు శాప విమోచనా మార్గం చెప్పిన ఋషి ఇంకో విషయం కూడా చెప్పాడు. ప్రతి వంద ఏళ్ళకూ ఒక రాజ కుమారుడు ఈ ద్వీపానికి వస్తాడట. కాబట్టి ఫర్లేదు. ఇంకో వందేళ్ళు వేచి ఉంటాలే. నీ దారిన నువ్వు పో.”
“అలా ఎలా పోతాను స్వామి. మీకు శాప విమోచన చేస్తేనే కద నాకు ఆత్రవింద, పండు కోతి దక్కేది. మరి అది జరగాలి అంటే నేను పాట పాడాలి. నాకు ఇంకో అద్భుతమైన పాట వచ్చు. యమ కింకరి, యమానందల హరి అని ఉంది లెండి. అది పాడితే తప్పక ఈ పుట్ట కరిగిపోతుంది.”
“వద్దురా నాయనా. కావాలంటే వాళ్ళని నిస్సంకోచంగా తీసుకుపో. నువ్వు పాట పాడకుంటే చాలు. ఆటవికులు చూడు ఆకులు చెవుల దగ్గర పెట్టుకుని ఎలా తయారయ్యారో?”
“నిజంగా? ఐతే సరే! కానీ తిరిగి వెళ్ళడానికి నా తెప్ప, తెడ్లు లేవే?”
కళ్ళు మూసుకుని ఏదో మంత్రం జపించాడు గానానంద స్వామి. అంతే! తెప్ప తెడ్లు నరస సింహుడి ముందు ప్రత్యక్షమయ్యాయి.
“మర్చిపోయాను స్వామి. ఈ తెప్ప చాలా చిన్నది. నా ఒక్కడికైతే సరి పోయింది. ఇప్పుడు ముగ్గురం ఉన్నాము. తెడ్లు నేనొక్కడినే వెయ్యాలి. చాల కష్టమైన పని,” వినయంగా అన్నాడు యువరాజు.
“ఐతే నన్నేం చేయమంటావు? గాలిలో ఎగిరే మాయా తివాచీ ఇవ్వమంటావా?” పళ్ళు పట పటా కొరికాడు గానానంద స్వామి.
“అదిగో! మీకు కోపం వచ్చింది. పాట పాడి మిమ్మల్ని ప్రసన్నం చేసుకుంటాను,” చిన్న బుచ్చుకున్నాడు నరస సింహుడు.
ఒక్క సారి నిట్టూర్చి మళ్ళీ కళ్ళు మూసుకుని మంత్రం పఠించారు స్వామి వారు.
గాలిలో తేలుతున్న మాయా తివాచి ప్రత్యక్షమయ్యింది.
“దీని మీద మీరు ముగ్గురూ సులువుగా ప్రయాణం చేయవచ్చు. కావాలంటే తెప్ప, తెడ్లు కూడా పట్టుకెళ్ళండి,” అన్నాడు గానానంద స్వామి.
“తెప్ప తెడ్లు తప్పకుండా తీసుకు వెళ్ళాలి. అసలే మత్స్య కుమారుడికి మాటిచ్చాను. మరి ఈ తివాచీ మీకు ఇవ్వడానికి నేను తిరిగి రావాలేమో?”
“వద్దు! మీరు గమ్యం చేరాక ఆ తివాచి దానంతట అదే నా వద్దకు తిరిగి వచ్చేస్తుంది. త్వరగా వెళ్ళండి.”
“ఆగండి స్వామీ! నాకు గండ్ర, మండ్రతో కాస్త పని ఉంది. అది పూర్తి చేసుకుని వెళ్ళిపోతాను,” అన్నాడు నరస సింహుడు.
ఆ తరువాత గండ్ర, మండ్రని ఏదో అడిగాడు యువరాజు. మండ్ర తల ఊపి ఒక గుడిసెలోకి వెళ్ళి చిన్న సంచి తెచ్చి నరస సింహుడి చేతిలో పెట్టాడు.
ఆత్రవింద, పండు కోతి, తెప్ప, తెడ్లు, నరస సింహుడు అధిరోహించిన తివాచీ బెంగ నగరం వైపు ఆకాశ మార్గాన బయలు దేరింది.
(ఇంకా ఉంది)
Comments (5)
Comments (15)
Comments (6)